Kondapalli Fort Dargah | కొండపల్లి ఖిల్లాకు దారి నహీ
Kondapalli Fort Dargah | కొండపల్లి ఖిల్లాకు దారి నహీ
Kondapalli Fort Dargah | అటు చెట్లు.. ఇటు గోతులు .. ఘాట్ రోడ్డు అధ్వానం
ఈరోజు రాత్రి దర్గా ఉరుసు షురూ
ఏర్పాట్లలో అధికారులు విఫలం
పారిశుధ్యం నిల్
సమన్వయ లోపం
నిద్రావస్థలలో అధికారులు
Kondapalli Fort Dargah | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ ; కొండపల్లి ఖిల్లాపై హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా దర్గా 438వ ఉరుసు మహోత్సవానికి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయి. కొండపల్లి ఖిల్లా దర్గా, భవానీపురం దర్గా ఉరుసు మహోత్సవాలు ఒకే రోజు కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి ముస్లింలు రెండు దర్గాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

అలాగే సోమవారం రాత్రి జాగరణ చేస్తారు. సుమారు రెండు వేల ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలపై ముస్లింలు భవానీపురం నుంచి కొండపల్లి ఖిల్లాపై దర్గాకు, అక్కడి నుంచి భవానీపురం దర్గాకు చేరుకుంటారు. అయితే ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి ఖిల్లాపై దర్గా ప్రాంగణంలో పురపాలక సంఘం పారిశుధ్య చర్యలు చేపట్టలేదు.

మరోవైపు పర్యాటక ప్రదేశంగా పేరొందిన కొండపల్లి ఖిల్లాకు వెళ్లే ఘాట్ రోడ్డు అధ్వానంగా తయారైంది. బూడిద చెరువు వరకు రహదారి బూడిదతో నిండి, గోతుల మయమై ఉంది. అక్కడి నుంచి పిచ్చి మొక్కలు, చెట్లు రహదారిపైకి చొచ్చుకురావడంతో కుచించుకుపోయింది. ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకునే వీలు లేకుండా ఉంది. అలాగే దర్గా వద్ద ఎలాంటి పారిశుధ్య చర్యలు చేపట్టలేదు.

ఇటు పర్యాటకులు, అటు వేల సంఖ్యలో ముస్లింలు వచ్చే ఖిల్లా ప్రాంతం అధ్వానంగా ఉంటే అటవీ, పర్యాటక, పురావస్తు, మున్సిపల్ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమంటున్నారు. గోతుల మయమై, కుచించుకుపోయి అధ్వానంగా ఉన్న రహదారిపై రాత్రి వేళ చీకట్లో ప్రయాణించేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆయా శాఖల అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
