చిట్టినగర్‌లో ఉచిత వైద్య శిబిరం..

  • 157 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

చిట్టినగర్, ఆంధ్రప్రభ : ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఉచిత మొబైల్‌ వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శనివారం చిట్టినగర్‌ సర్కిల్‌-1 కార్యాలయం వద్ద నిర్వహించిన వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి శని, ఆదివారాల్లో ఉచిత మొబైల్‌ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం జరిగిన శిబిరంలో దంత, కంటి పరీక్షలతో పాటు జనరల్‌ ఫిజీషియన్‌ సేవలు అందించారు. రక్తపోటు, మధుమేహ పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.

కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో పీవీఆర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అమరావతి ఐ ఆసుపత్రి, ప్రభుత్వ దంత వైద్యుల బృందాలు పాల్గొని 157 మందికి వైద్య పరీక్షలు, చికిత్సలు అందించారు. అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, మాజీ కార్పొరేటర్‌ నాగోతి రామారావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలివాడ పట్నాయక్‌, జనసేన పార్టీ సీనియర్‌ నాయకుడు వెంపలి గౌరీశంకర్‌, మాజీ కార్పొరేటర్‌ పైడిమాల సుభాషిణి, పోతినేడి లోకేష్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు పగిడిపల్లి ప్రభుచరణ్‌, పాలవాయి దాసు, పైలా నరసింహారావు, సుజనా ఫౌండేషన్‌ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొని సేవలందించారు.