Fire Accident | ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..
Fire Accident | ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..
- ఏసీ పేలుడు
Fire Accident | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో అమర్చిన ఎయిర్ కండిషనర్ (ఏసీ) అకస్మాత్తుగా పేలిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించి, రెండో అంతస్తు మొత్తాన్ని కమ్మేశాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవదహనమయ్యారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారికి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఘటనలో పలువురు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలను పణంగా పెట్టి సుమారు 15 మందిని రక్షించారు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీ పేలుడే అగ్నిప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన నెలకొంది. నిపుణులు నాసిరకం ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
