Harish Rao | ప‌త్తి కొనుగోళ్లు లేక రైతుల ఆందోళ‌న‌

Harish Rao | ప‌త్తి కొనుగోళ్లు లేక రైతుల ఆందోళ‌న‌

సీసీఐ నిబంధ‌న‌లు స‌వ‌రించాలి


Harish Rao | వ‌రంగ‌ల్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు గుర‌వుతున్నార‌ని, సీసీఐ నిబంధ‌న‌లు స‌వ‌రించి స‌మ్మె విర‌మింప‌జేయాల‌ని, ప‌త్తి కొనుగోళ్లు వెంట‌నే ప్రారంభించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హ‌రీశ్‌రావు (T. Harish Rao) అన్నారు. ఈ రోజు వ‌రంగ‌ల్ ఏనుమాముల మార్కెట్‌ను ప‌రిశీలించిన ఆయ‌న ప‌త్తి రైతుల‌తో మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నార‌ని, కిసాన్ యాప్ ద్వారా రైతులు అయెమాయానికి గుర‌వుతున్నార‌ని అన్నారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలతో రైతులు దళారులకు పత్తి అమ్ముకుంటున్నార‌న్ని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతి చిన్న దానికి ఢిల్లీ పోతాడ‌ని, ప్ర‌ధాని మోడీతో దోస్తీ ఉంద‌ని అన్నారు. ప్రధానితో మాట్లాడి.. పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించాల‌ని కోరారు. కిసాన్ యాప్ రద్దు చేయండ‌ని, గతంలో కొనుగొలు చేసిన విధానంలో పత్తి కొనుగొల్లు చేయాల‌న్నారు.

కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు బడా పారిశ్రామిక సంస్థలు వ్యాపారులకు లాభమ‌ని, రైతులకు ఏలాంటి లాభం లేదని హ‌రీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఏడాది పాటు విజయోత్సవలు జరుపుతారు? రైతులను మోసం చేసినందుకా? యూరియా సకాలంలో ఇవ్వనందుకా అని ప్ర‌శ్నించారు. రైతుల‌కు (farmers) చెల్లించాల్సిన ధాన్యం బోన‌స్ వెంట‌నే మంజూరు చేయాల‌న్నారు. వ్యవసాయ మంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జ‌ర‌పాల‌ని, కేంద్రం ఇప్పటికైన దిగొచ్చి తేమ శాతాన్ని సవరించి పత్తి కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. రైతుల మంచి కోరే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, రైతుల పక్షాన ఉద్యామించే పార్టీ బీఆర్ఎస్ (BRS) అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఇళ్ల‌ను ముట్ట‌డిస్తామ‌న్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరంగల్ ముంపుకు గురవుతుంద‌ని, ముంపు బాధితులకు ప్రభుత్వం 15వేల రూపాయలను సహాయం చేయాల‌న్నారు.