శరత్ ఆధ్వర్యంలో 43వ మెగా కంటి వైద్య శిబిరం

శరత్ ఆధ్వర్యంలో 43వ మెగా కంటి వైద్య శిబిరం
చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29న పట్టణంలో 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుమారుడు ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతంలో కంటి శుక్లాల చికిత్సలకు మాత్రమే పరిమితమైన సేవలను ఈసారి మరింత విస్తరించి రెటీనా సంబంధిత వ్యాధులు, రెటీనా డిటాచ్మెంట్ వంటి క్లిష్ట సమస్యలకు కూడా నిపుణులైన వైద్యులతో పూర్తిగా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యే ఆధునిక చికిత్సలను నిరుపేదలకు ఉచితంగా అందించడం విశేషమన్నారు. ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇలాంటి సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన తనయుడు శరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
