ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. స్లమ్ ఏరియాలో మంటలు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. స్లమ్ ఏరియాలో మంటలు
విద్యుత్ ప్యానెల్లో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగిన ఘటన
ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగ భవన్ సమీపంలోని స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం, విద్యుత్ ప్యానెల్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అనంతరం అవి సమీపంలో ఉన్న కార్మికుల గుడిసెలకు వేగంగా వ్యాపించాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలు ఫైరింజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
