న్యూ ఢిల్లీ | ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ మీటింగ్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే.
వచ్చే వారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లు
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే కొత్త ఆదాయపు పన్ను బిల్లులో దీర్ఘ వాక్యాలు, నిబంధనలు, వివరణలు ఉండవని ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే అన్నారు. నేడు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో, ఆదాయపు పన్ను రేట్లు, స్లాబ్లు మరియు టి డి ఎస్ నీబంధనలలో ఇటీవలి మార్పులు కూడా ఇందులో ప్రతిబింబిస్తాయని పాండే చెప్పారు.
అదనపు పన్నుల భారం కూడా ఉండబోదని స్పష్టం చేశారు. చట్టాలు కేవలం న్యాయ నిపుణుల కోసం మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా ఉండాలని ఈ బిల్లు రూపొందించినట్లు పాండే తెలిపారు.