భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.. ఈ కాల్పులు విరమణ ఒప్పందం నేటి సాయంత్రం అయిదు గంటల నుంచి అమలులోకి వచ్చిందని తెలిపారు.. నేటి మధ్యాహ్నం 3.35 కి పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ మన మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ కు ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారని తెలిపారు.. దీనిపై ఉన్నతస్థాయి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన అనంతరం విరమణకు భారత్ కూడా అంగీకరించిందన్నారు.. అంతే కాకుండా భారత్, పాక్ కు చెందిన మిలటరీ జనరల్స్ మధ్య ఈ నెల 12 వ తేదిన చర్చలు జరగనున్నాయని కూడా మిస్రీ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.. . ఈ సాయంత్రం నుంచి భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
దృఢంగా ఉన్న భారత్
కాల్పుల విరమణను ధృవీకరిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిరంతరం దృఢమైన, అచంచలమైన వైఖరిని ఇలాగే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు
ధైర్యమైన నిర్ణయంపాకిస్తాన్ దాడుల విషయంలో కేవలం ప్రతిసారీ మౌనంతో సాధ్యపడదని భారత్ ఇటీవల దాడులతో నిరూపించింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. భారత్, తన శక్తిని మౌనంగా చూపించకుండా, స్పష్టంగా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ దురుద్దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ప్రతిస్పందనతో పాక్ చివరికి వెనక్కి తగ్గింది. అమెరికా మధ్యవర్తిత్వంతో, కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించింది.చివరకు శాంతికే..ఈ నేపథ్యంలో శనివారం (మే 10న) సాయంత్రం ఈ పరిస్థితులకు ముగింపు లభించింది. అయితే శాంతి అంటే బలహీనత మాత్రమే కాదు. అది సమర్థత, స్థిరత్వం, దేశ ప్రజల పట్ల నిబద్ధత గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పవచ్చు. ఈ పరిణామం శాంతిని నిలుపుకోవడంతోపాటు సైనిక శక్తి ఎలా ఉపయోగిస్తుందో భారత్ మరోసారి పాకిస్తాన్ సహా అనేక దేశాలకు చూపించింది. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రజల ప్రాణాల గురించి ఆలోచించిన భారత్ చివరకు శాంతి విధానానికి సమ్మతించింది.