హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్గా సేవలందిస్తున్న ఓ మహిళ.. డ్రగ్స్కు బానిసగా మారడం కలకలం రేపుతోంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే సుమారు ₹70 లక్షల విలువైన మాదకద్రవ్యాలను ఆ డాక్టరమ్మ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డాక్టర్ వ్యవహారంపై సమాచారం అందడంతో నిఘాపెట్టారు. తాజాగా ₹5 లక్షల విలువైన డ్రగ్స్ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
షేక్పేట డాక్టరమ్మ..
రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ పేటలోని ఏపీఏహెచ్సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. డ్రగ్స్కు బానిసైన ఆ డాక్టర్ కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్ను వాట్సాప్లో సంప్రదించి ₹5 లక్షల విలువైన కొకైన్కు ఆర్డర్ చేశారు. ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రాంప్యార్ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు.
రెడ్ హ్యాండెడ్గా దొరికారిలా..
నగరానికి కొకైన్ తీసుకొచ్చిన రాంప్యార్.. ఆ ప్యాకెట్ను డాక్టర్ నమ్రతకు అందిస్తుండగా పోలీసులు సీన్లోకి ఎంటరయ్యారు. డాక్టర్ నమ్రతతో పాటు రాంప్యార్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.