రైతులకు తీపి కబురు

రైతులకు తీపి కబురు
-తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై స్పందించిన కేంద్రం
-గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందన
తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా గాజులమండ్యం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ, ఆధునీకరణ అంశంపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం తాను ఈ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.
ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ), షుగర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాదనం ఇచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఇండియన్ పొటాష్ లిమిటెడ్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గాజులమండ్యం చక్కెర కర్మాగారం పునరుద్ధరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుందని ఎంపీ మద్దిల గురుమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.
