ఏయూఈఈటి – 2026 ఫలితాలు విడుదల

ఏయూఈఈటి – 2026 ఫలితాలు విడుదల
ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆంధ్రప్రభ:
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో సెల్ఫ్సపోర్ట్ విధానంలో నిర్వహించే ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయూఈఈటి -2026 ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డీన్ ఆచార్య కె.శ్రీనివాస రావు, ఆచార్య వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 7 ప్రధాన నగరాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 5327 మంది దరఖాస్తు చేయగా 4707 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరికి మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. త్వరలో ఆన్లైన్లో సర్టఫికేట్ల పరిశీలన, కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. ప్రత్యేక విభాగాల వారికి పెదవాల్తేరులోని సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షలో విజయనగరానికి చెందిన జి.జయరాం 84 మార్కులతో ప్రధమ స్థానంలో నిలచాడు. పల్నాడుకు చెందిన జి.వెంకట భువన తేజ 2వ ర్యాంకును, ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు చెందిన షేక్ నౌషీర్ 3వ ర్యాంకు, శ్రీకాకుళంకు చెందిన వి.మురళీకృష్ణ 4వ ర్యాంకు, శ్రీకాకుళంకు చెందిన కె.లిఖిత్ 5వ ర్యాంక్ పొందారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విసి ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందనలు తెలియజేశారు .
