భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లండ్ జట్టు ఇదే !

  • ఓపెనర్‌గా జాకబ్ బెతెల్‌..
  • స్పిన్ బలంతో భారత్‌ను నిలువరించే వ్యూహం
  • బట్లర్‌కు 200వ వన్డే

ఆంధ్రప్రభ : భారత్‌తో మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే తొలి వన్డేకు ఇంగ్లండ్ జ‌ట్టు ఒక‌రోజు ముందే తన తుది జట్టును ప్రకటించింది. యువ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెతెల్‌ను బెన్ డకెట్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దింపుతూ ఇంగ్లండ్ సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల టీ20 సిరీస్‌లో 4-0తో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్, వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెన్ డకెట్‌కు స్థిరమైన ఓపెనింగ్ భాగస్వామిని వెతుకుతున్న క్రమంలో జాకబ్ బెతెల్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.

ఇక‌ ఈ మ్యాచ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు 200వ వన్డే కావడం విశేషం. 2012లో పాకిస్థాన్‌పై వన్డే అరంగేట్రం చేసిన బట్లర్ ఇప్పటివరకు 5,515 పరుగులు, 11 సెంచరీలు, 29 అర్ధశతకాలు నమోదు చేశాడు. భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ మూగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ స్పిన్ బాధ్యతలు చేపట్టనుండగా, పేస్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ ఆడనున్నారు. దీంతో గస్ అట్కిన్సన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కలేదు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ అనంతరం రెండో వన్డే జూలై 16న కార్డిఫ్, మూడో వన్డే జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనుంది.

భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్

జాకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్,హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.