విమానయాన పటంలో ఆదిలాబాద్

- ఎయిర్పోర్టు భూ సేకరణకు నోటిఫికేషన్…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి కోసం మొత్తం 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక సానుకూలంగా రావడంతో, భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నిర్ణయంతో ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు చేయనున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమతుల్య ప్రాంతీయ వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఆదిలాబాద్ త్వరలోనే దేశ విమానయాన పటంలో కీలక స్థానం దక్కించుకోనుందని ఆయన అన్నారు.
