Polio Drops | ఆరోగ్య ఆంధ్రా వైపు అడుగులు

Polio Drops | ఆరోగ్య ఆంధ్రా వైపు అడుగులు
- స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకుందాం
- పోలియో అంతమొందినా అప్రమత్తంగా ఉందాం
- అయిదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
Polio Drops | ఆంధ్రప్రభ, విజయవాడ : సమష్టిగా అడుగులు వేస్తూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకుందామని.. ఈ క్రమంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కృషిచేద్దామని, పోలియో అంతమొందినా అప్రమత్తంగా ఉంటూ అయిదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం విజయవాడ, ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, రోటరీ, లయన్స్, ఇండియన్ మెడికల్ అసోసియన్ (ఐఎంఏ) తదితర సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పోలియోను అంతమొందించడం జరిగిందని.. అయితే ముందు జాగ్రత్తగా చిన్నారులకు ఆరోగ్యకరమైన బంగారు భవితను అందించాలనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉంటూ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న బూత్ స్థాయిలోనూ.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.

611 గ్రామీణ బూత్లు, 355 అర్బన్ బూత్లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్రత్యేక బృందాలు సేవలందిస్తాయన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్ల కూడా పాయింట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏ ఒక్కరూ మిగిలిపోకుండా 100 శాతం ఇమ్యునజైషేన్ జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, డా. హనుమయ్య (ఐఎంఏ), డా. శ్రీదేవి, డా. శరత్ (ఐఏపీ), డా. చిలకపాటి రామ్ చంద్, డా. శ్యాం మువ్వ, డా. బోడేపూడి హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.
