Polling stations | పోలింగ్ ప్రశాంతం..

Polling stations | పోలింగ్ ప్రశాంతం..
Polling stations | భూపాలపల్లి, ఆంధ్రప్రభ : రెండో విడత ఎన్నికలు జరుగుతున్న భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు ప్రాథమికోన్నత పాఠశాలను ఆదివారం భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తో కలిసి పరిశీలించారు. అనంతరం కొంపెల్లి జడ్పీ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ శాతం పరిశీలించి పోలింగ్ కేంద్రాల సందర్శన ఫారంలో సంతకాలు చేశారు. గొర్లవీడు ప్రాథమికోన్నత పాఠశాలలో 3496 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే కొంపెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 2125 ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, పోలింగ్ జరుగుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలించారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు వీల్ ఛైర్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో రెండో విడత భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ప్రజలు ఉదయం 7 గంటల నుండే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ తరుణి ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
