ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయకమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓ వైపు సహాయక చర్యలు మరింత వేగంగా కొనసాగిస్తూనే.. జరిగిన ప్రమాదానికి బాధ్యులైన వారిపై విచారణ జరిపించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తాజాగా జరిగిన ఎస్ఎల్బిసి సొరంగం ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంలో భాగమైన బ్యారేజ్లో ఒక పిల్లర్కి పర్రె పడితే.. కాళేశ్వరం కూలిపోతుందని, లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. మరి సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే, ఖమ్మంలో పెద్ద వాగు బ్రిడ్జి కూలిపోతే, SLBC టన్నెల్ కూలిపోతే ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని… బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి సహా, అనేక అంశాలపై న్యాయ కమిషన్ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారని.. రాష్ట్రంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమీషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తాజా ఘటనలపై వెంటనే న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో… ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో ఎస్ఎల్బీసీ టన్నల్ లో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని కోరారు.
ఉత్తమ్, కొమటిరెడ్డి రెడ్డిలపై కేటీఆర్ ఫైర్
సొరంగ ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు చెప్పిండే చెబుతున్నారని విమర్శించారు. ఎనిమిది మంది తప్పిపోగా.. యంత్రాలకు 300 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు.
అసలు ప్రభుత్వం టన్నెల్ పనులు పునఃప్రారంభించే ముందు ఎలాంటి సాంకేతిక అధ్యయనం చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే సొరంగం ప్రమాదంపై విచారణ జరిపాలని… బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు.