శాంతియుత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి..
- పోలీస్ కమీష నర్ అంబర్ కిషోర్ ఝా
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. శనివారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్న స్టాటిక్ సర్వేలె యన్స్ చెక్ పోస్ట్ ను సీపీ సందర్శించారు.
వాహన తనిఖీల వివరాల రిజిస్టర్ ను సీపీ తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమ రవాణాకు ప్రయత్నించే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది వాహనాలను తనిఖీ సమయంలో తగిన జాగ్రత్తలు రేడియం జాకెట్స్ వేసుకోవాలని, లైట్స్ అందుబాటులో ఉంచుకోవాలని స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పెద్దపల్లి జోన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ వద్ద నిత్యం వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని సీపీ తెలిపారు. అనంతరం గర్రెపల్లి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ, సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను సీపీ సందర్శించారు.
ముందస్తు సమాచారం సేకరించి ప్రచారం సమయంలో, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున, ఫలితాలు వెల్లడించిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అమలు చేయాలని, ఏ సమాచారం వచ్చినా, వెంటనే స్పందన తప్పనిసరని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై, ట్రబుల్ మాంగర్స్ పై 24/7 పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఈకార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ పాల్గొన్నారు.

