అన్యమతస్త ఉద్యోగులపై నివేదిక….

  • టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుపతి ప్రతినిధి , ఆంధ్రప్రభ : టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకునేలా నివేదిక తయారు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలన్నారు.

అన్యమతస్తులపై నివేదిక

టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకునేలా నివేదిక తయారు చేయాలనన్నారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి? ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్ఓపీ) రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు. పోటు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక, పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. టీటీడీలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్‌ను పటిష్ట పర్చేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు.

వేగంగా అమరావతి వెంకన్న ఆలయం విస్తరణ పనులు

శ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా (క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ) ప్రణాళికలు రూపొందించాలన్నారు. తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.

అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎఫ్ఏ సీఏవో బాలాజీ, సీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply