Champions Trophy | టీమ్ ఇండియా చెత్త రికార్డు !

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. ఈ ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగా జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు.

అయితే వన్డే ఫార్మాట్‌లో టీమిండియా వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 12వ సారి. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో సహా తాజా మ్యాచ్ వరకు భారత్ వరుసగా టాస్‌లను కోల్పోయింది. దాంతో నెదర్లాండ్స్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డ్‌ను టీమిండియా అధిగమించింది.

నెదర్లాండ్స్ జట్టు 2011-2014 మధ్య వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది. భారత్ టాస్ ఓడిన 12 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ శర్మ 9 సార్లు కెప్టెన్‌గా ఉండగా.. మరో మూడు సార్లు కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు ఆడింది. ఈ సిరీస్‌లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించాడు. అతను మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడాడు.

ఆ తర్వాత శ్రీలంకతో గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో మూడు వన్డేలు ఆడిన టీమిండియా.. మూడింటిలో టాస్ గెలవలేదు. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల్లోనూ టీమిండియా టాస్ గెలవకపోవడం గమనార్హం. టీమిండియాకు టాస్ కలిసిరాకున్నా.. విజయాలను మాత్రం అందుకుంది.

గత 11 మ్యాచ్‌ల్లో టీమిండియా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది. గత 15 నెలలుగా వన్డేల్లో టీమిండియా టాస్ గెలవడంలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ ఉండటంతో టీమిండియా మూడే వన్డేలు ఆడింది. దాంతో ఈ చెత్త ఫీట్‌ను తమ పేరిట లిఖించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *