TG | పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు : సీఎం రేవంత్
- పాలమూరు పేరు చెప్పి రాజకీయాలు
- జిల్లాకు చేసిందేమీ లేదు
పాలమూరు జిల్లాను గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్… పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నా ఈ జిల్లాకు న్యాయం జరగలేదని విమర్శించారు.
నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సీఎం… పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, 12 ఏళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారని, 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధమని, గత పదేళ్ల పాలనపై చర్చిద్దామని, ఈ చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.
తన మీద పగతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారని సీఎం ఆరోపించారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దని సూచించారు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
గతంలో పాలమూరు పేరు చెప్పి కొందరు సీఎంలు రాజకీయాలు చేశారు కానీ… జిల్లాకు చేసిందేమీ లేదని రేవంత్ ఆరోపించారు. నెట్టెంపాడు, భీమా, సంగంబంధం, కోయిలసాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పదేళ్లలో పూర్తి చేసి ఉంటే నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు. వైఎస్సార్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు.