ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఉమ్మడి మెదక్ జిల్లా(Combined Medak District)లో కుండపోత వర్షంతో జన జీవనం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదలో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. భారీ వర్షాలు, వరదలో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. హల్దీ ప్రాజెక్టు (Haldi Project) ఉధృతితో కుప్పులపల్లి, హకీంపేట మధ్య నిలిచిన రాకపోకలు. టేక్మాల్ మండలం బోడ్మట్పల్లి వద్ద పొంగుతున్న పెద్దవాగు. దీంతో బోడ్మట్పల్లి-మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేక్మాల్ మండలం దన్నురా వద్ద చెరువకట్టపై వరదతో నిలిచిన రాకపోకలు.అల్లాదుర్గంలో ఒట్టికుంట చెరువు కట్ట తెగడంతో పొలాల్లోకి వరద. సుమారు 200 ఎకరాల్లో పంట నీటమునిగింది. నీలకంటిపల్లి, అల్లాదుర్గం రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉసిరికపల్లి, గూడూరు, గంగయ్యపల్లి, గుండ్లపల్లి చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో వాగులు, అలుగులు పొంగుతున్నాయి.
రాకపోకలకు అంతరాయం..
శివ్వంపేట మండలం పాంబండ వద్ద భారీ వరదకు నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఉసిరికపల్లి, వెల్దుర్తి మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోతులబొగుడ వద్ద కల్వర్టు తెగడంతో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. బిజిలీపూర్ వాగు ఉధృతితో గంగాయిపల్లి-బిజిలీపూర్ మధ్య రాకపోకలు బందయ్యాయి. నర్సాపూర్ మండలం ఖాజీపేటలో మోతుకు కుంటకు మరోసారి గండిపడింది. రెండు రోజుల క్రితం గండిపడటంతో రెవెన్యూ సిబ్బంది, నీటిపారుదల అధికారులు మరమ్మతులు చేశారు. అయితే తాజాగా పడిన వర్షానికి మరోసారి అదేచోట గండపడటంతో నీరు వృథాగా పోతున్నది.
జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం
ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు (Singuru Project) నుంచి 5 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నది (Manjira River) ఉగ్రరూపం దాల్చింది. దీంతో మెదక్ జిల్లా నాగ్సాన్పల్లి గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయం (Edupayala Sri Vanadurga Bhavani Mata Temple) గత నాలుగు రోజులుగా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగి,ఏడుపాయల గుండా పొంగిపొర్లడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. ప్రధాన ఆలయం లోపలికి వరద నీరు చేరింది. భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలు లేకపోవడంతో అధికారులు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం భక్తులు ఆలయ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉదృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది దృశ్యాలను భక్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. భద్రత చర్యల్లో బాగంగా ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నది పరిసరాలకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వర్షపాతం ఇలా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది. సిద్దిపేట జిల్లా (Siddipet District) గౌరారంలో అత్యధికంగా 23.5 సెం.మీ. వర్షపాతం నమోదయింది. ములుగులో 18.6, బేగంపేటలో 16.2, అంగడి కిష్టాపూర్లో 14.1, ఇస్లాంపూర్లో 17.8, కౌడిపల్లిలో 17.2, చిన్నశంకరంపేటలో 16.4, దామరంచలో 15.8, మాసాయిపేటలో 14.8, కంగ్టిలో 16.6, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్లో 10.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.