ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు తీవ్ర కలకలం రేపింది. కోట కాలనీకి చెందిన నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని ఒక హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్న నూర్, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. నూర్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు, అతని నుంచి 16 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్కార్డుల ద్వారా అతను ఎవరితో సంప్రదింపులు జరిపాడు అనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే నూర్ను అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
గతంలో జరిగిన ఉగ్రవాద కేసుల విచారణలో భాగంగా, ధర్మవరంలో నూర్కు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. పక్కా సమాచారంతో, అత్యంత గోప్యంగా ఈ ఆపరేషన్ను నిర్వహించి నూర్ను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా నూర్ కదలికలపై అధికారులు నిఘా పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో ఆందోళన కలిగించింది.