21 రోజుల పాటు చిత్ర హింసలు పెట్టినట్లు వెల్లడి
నిద్రపోనివ్వకుండా మాటల యుద్దం
భోజన సమయంలో మినహా కళ్లకు గంతలు విప్పని వైనం
న్యూ ఢిల్లీ – పంజాబ్ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన జవాన్ పూర్ణమ్ కుమార్ షా పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల పాటు పాక్ నిర్బంధంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు భారత అధికారులకు అప్పగించారు.
పాకిస్థాన్ అధికారులు జవాన్ కుమార్ షాను అదుపులోకి తీసుకున్న తర్వాత అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది.. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టి ఉంచారని, నిద్రపోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది. అంతేకాకుండా పాక్ అధికారులు ఆయనను తరచూ మాటలతో దూషిస్తూ, మానసికంగా వేధించినట్లు పేర్కొంది. అలాగే మన దేశ రహస్యాల కోసం అతడిపై పలు రకాలుగా వత్తిళ్లు తెచ్చారని పేర్కొంది.. అలాగే పూర్ణమ్ కుమార్ ను హింసించిన వారంతా సివిల్ డ్రస్ లో ఉన్నారని కూడా వెల్లడించింది.. బందీగా చిక్కిన సైనికుడు పట్ట పాక్ అమానుషంగా ప్రవర్తించిందని, దీనిపై పాక్ ను ప్రశ్నిస్తామని ఆర్మీ పేర్కొంది. సాధారణంగా యుద్ధ ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉండగా పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పట్ల ఇంతటి కఠినంగా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు.