ట్యాంక్‌ బండ్‌ వద్ద సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా ట్యాంక్‌ బండ్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న ఆయన విగ్రహ పనులను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. ఈ నెల 18న సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులతో పాటు ల్యాండ్‌స్కేపింగ్‌, సుందరీకరణ పనుల పురోగతిని నేతలు పరిశీలించారు.

పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన, విగ్రహావిష్కరణతో పాటు నిర్వహించనున్న పలు కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.