ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అరెస్ట్ !
- అత్యాచారం కేసులో పోలీసులు అదుపులోకి
- వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు
ఆంధ్రప్రభ : ఢిల్లీ క్యాపిటల్స్, బెంగాల్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన అత్యాచారం కేసులో ఆయనను హుగ్లీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ అనంతరం అధికారికంగా అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి చిన్సురా కోర్టులో హాజరుపరిచారు.
మోగ్రా పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదులో.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, వ్యక్తిగత క్షణాలను రికార్డు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో నిరూపితం కాలేదు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైకోర్టు ఆదేశాల తర్వాత అరెస్ట్..
ఈ కేసులో కలకత్తా హైకోర్టు గతంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జూలై 14న న్యాయమూర్తి సౌగత భట్టాచార్య ఇచ్చిన ఉత్తర్వుల్లో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు చర్యలు కొనసాగించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
తన వ్యక్తిగత ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించినట్లు కూడా బాధితురాలు ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయాలని కోర్టు సూచించింది. ఇప్పటికే ఓ పెన్డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు కోర్టుకు వెల్లడించారు.
క్రికెట్ కెరీర్పై ప్రభావం?
23 ఏళ్ల అభిషేక్ పోరెల్ బెంగాల్ క్రికెట్లో వికెట్ కీపర్ బ్యాటర్గా గుర్తింపు పొందారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేసిన ఆయన అనంతరం భారత్-ఏ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం నమోదైన కేసు ఆయన క్రికెట్ కెరీర్పై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే కేసులోని ఆరోపణలు న్యాయపరంగా ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
