ఓటర్ల జాబితాలో భారీ మార్పులు!

మొత్తం ఓటర్లు: 3,38,26,448
ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తయినవి: 2,64,87,214
ఫారాలు పూర్తి చేసిన శాతం: 78.30%
ఫారాలు పెండింగ్‌: 73,39,234
పెండింగ్‌ శాతం: 21.70%
మరణించినట్లు గుర్తించిన వారు: 6,70,203
శాశ్వతంగా మారిన వారు: 45,18,961

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా వివరాల సేకరణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఇప్పటివరకు 2,64,87,214 మంది (78.30 శాతం) డిక్లరేషన్‌ చేసిన ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించారు. మరో 73,39,234 మంది (21.70 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు ఇంకా స్వీకరించాల్సి ఉంది.

ఓటరు జాబితా సవరణలో భాగంగా అందిన వివరాలను పరిశీలిస్తే.. 9,22,230 మంది ఓటర్లు తమ వివరాలను సమర్పించగా, 11,25,546 మంది ఓటర్లు తమకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయలేదని గణాంకాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా 45,18,961 మంది ఓటర్లు శాశ్వతంగా మారినట్లు, 6,70,203 మంది ఇప్పటికే మరణించినట్లు గుర్తించారు. మరో 1,02,294 మంది ఓటర్లకు సంబంధించి ఇతర కారణాలతో వివరాలు నమోదు చేసినట్లు గణాంకాల్లో పేర్కొన్నారు.

21.70 శాతం ఫారాలు పెండింగ్‌

రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 78.30 శాతం మంది ఎన్యుమరేషన్‌ ఫారాల ప్రక్రియను పూర్తి చేయగా.. మిగిలిన 21.70 శాతం మంది ఓటర్ల వివరాలపై ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఓటర్ల వివరాలను సేకరించేందుకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా, అనర్హులు లేదా మరణించిన వారి పేర్లను గుర్తించి సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.