ఆడాళ్లపై కొనసాగుతున్న ఆగడాలు
నడిరోడ్డుపైనే అతివలకు అవమానాలు
మొన్న బెంగళూరులో.. నిన్న హైదరాబాద్లో
ఇష్టారీతిన చెలరేగిపోతున్న ఈవ్ టీజర్లు
సిగ్గుతో తలదించుకున్న సభ్య సమాజం
పట్టించుకోని ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం
సీసీ కెమెరాల నిఘా ఉన్నా పోకిరీలకు భయం లేదు
అందరూ బాధత్యగా గుర్తించాలంటున్న బాధితులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
కాల గమనంలో యుగాలు దొర్లిపోగా.. మానవ సమాజంలో కృత్రిమ మేథో సంపత్తి పెరిగిన దశలోనూ.. దుశ్శాసన పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పడు చీకట్లో కీచకపర్వాలు చోటు చేసుకుంటే… ఇప్పుడు సమాజం సిగ్గుతో తలదించుకునేలా నడిరోడ్డుపైనే కొంతమంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ అకృత్యాలను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. కనీసం ప్రశ్నించటమూ లేదు. దీంతో ఆడబిడ్డలే తమకు జరిగే అన్యాయాలపై తిరుగుబాటు చేయాల్సి వస్తోంది.. భర్త ఎదుటే భార్యను అసభ్య పదజాలంతో కొందరు పోకిరీలు చెరబడితే.. అయ్యా కాపాడండని నడిరోడ్డులో ఓ అతివ గగ్గోలుపెట్టినా… కనీసం కన్నెత్తి చూడని పురుష పుంగవులు కొందరు. ఈ రెండు ఘటనలూ ఎక్కడో కాదు, దేశ ఆర్థిక స్థితి, గతికి అద్దంపట్టే ఐటీ రాజధానులు బెంగళూరు, హైదరాబాద్ మహానగరాల్లో చోటు చేసుకున్నాయి.
భర్త చితకబాది.. భార్యపై ఈవ్ టీజింగ్..
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున.. అదీ భర్త ఉండగానే వివాహితను పోకిరీలు వేధించిన తీరు షాకింగ్ కు గురిచేసింది. బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వెళ్తుండగా రాత్రి11:30 గంటలకు భర్త, మరిది, ఆడపడుచు ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు పోకిరీల కన్నుపడింది.ఇంకేముందీ.. ‘‘నన్నే నీ మొగుడు అనుకో.. నీ ఫోన్ నెంబరివ్వు..’ అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో బెదిరించారు. ఈ తాగుబోతులతో మనకెందుకని ఆ కుటుంబ సభ్యులు పక్కకు తప్పుకుని వెళ్లిపోతుంటే, ఆ పోకిరీలు మరింతగా రెచ్చిపోయారు. వారిని వెంటాడారు. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర భర్తపై దాడికి దిగారు. బాధిత మహిళలు పోలీసులకు ఫోన్ చేశారు. ఆ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు ఆకతాయిలను అరెస్టు చేశారు. పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్పల్లికి చెందిన ఉమేష్ (28)గా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కళ్ల ఎదుటే దుశ్శాసన పర్వం..
బెంగళూరులో ఈ మధ్యనే పోకిరీల చేతిలో వేధింపులకు గురైన ఓ మహిళ ఓ మీడియా ఎదుట తన ఆవేదన వెళ్లబోసుకుంది. ఓ పోకిరి తనను నడిరోడ్డు మీద వేధిస్తున్నా అతడిని నిలువరించేందుకు ఒక్కరు కూడా ముందుకురాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలో.. ప్రజల్లో మానసికమైన మార్పు రావాలని గుర్తుచేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని చెప్పింది.
అరిచి మొత్తకున్నా సాయం చేయలేదు..
‘ఎకోపార్క్ వరల్డ్లో బుధవారం రాత్రి 11.30 గంటలకు నేను వాకింగ్ చేస్తుంటే వెనక నుంచి ఎవరో వీపుపై కొట్టినట్టు అనిపించింది. ఎవరో ఇష్టారీతిని డ్రైవ్ చేస్తూ నన్ను తగిలారని అనుకున్నా. రెండోసారి ఇలాగే జరిగితే కాస్తంత షాకయ్యా. మరోసారి ఇలాగే జరిగింది. ఎవరో కావాలనే నన్ను వేధిస్తున్నారని అర్థమైంది. వెంటనే అక్కడున్న వారిని సాయం చేయమని కోరా.. ఆటో డ్రైవర్లను, ఇతర వాహనదారులను ఆపా.. గటంటిగా అరిచి మొత్తుకున్నా.. కాపాడండి అని కోరినా.. కానీ ఏ ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఎకోవరల్డ్లో ఉన్న ఓ సెక్యూరిటీ బూత్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాను. వారు సాయం చేశారు. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వయంగా డీసీపీ, ఏసీపీ రంగంలోకి దిగారు. విచారణ జరుగుతోంది. నన్ను వేధించిన నిందితుడు అరెస్టు అవుతాడని ఆశిస్తున్నా. ఇలాంటి వాళ్లు తప్పించుకుంటే ఇతరులకూ తప్పు చేసే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది’
ఫెమినిజం పేరిట పరిధిలు దాటొద్దు..
ఇలాంటి ఘటనలకు ఎవరినో నిందించడం సరికాదు. జనాలే ఇలాంటి ఘటనలకు బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ నాకు కుమారుడే కనుకు ఉంటే అతడికి స్త్రీలతో ఎలా ప్రవర్తించాలో చెబుతా. ఎందుకంటే మగాళ్లల్లో ఈ తరహా ప్రవర్తన మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. కొందరు మహిళలు కూడా ఫెమినిజం పేరిట ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. కాబట్టి, ఇది చట్టాలను, వ్యక్తిగత పరిధులను గౌరవించడానికి సంబంధించిన అంశం’’ అని బాధిత మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలిని నేను కాదు..
ఇన్ని సీసీటీవీ కెమెరాలు, పటిష్ఠమైన నిఘా ఉన్న ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటన జరగడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రజల మనసుల్లోనే అసలు సమస్య ఉందని ఈ విషయం తెలియజేస్తోంది. అయితే, నేను ఈ ఘటనలో బాధితురాలిని కాను. తప్పు చేసిన వ్యక్తే అసలైన బాధితుడు. ఒకరిని వేధించి ఆనందించే వారి మానసిక స్థితి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనల్లో మహిళలు అవమానంగా భావించి తెర వెనుక దాక్కోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకొచ్చి పోరాడాలి అని ఆ మహిళ స్పష్టం చేసింది.