వెలగపూడి : అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు…అమరావతి పర్యటనను ముగించుకుని డిల్లీ వెళ్లిన అనంతరం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. “అమరావతి అభివృద్ధిలో నూతన, చరిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి పట్ల ఉన్న దార్శనికత, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను అభినందిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా అమరావతిని నిర్మిస్తాం – చంద్రబాబు
రాజధాని అమరావతి పనుల పునప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, భాగస్వామ్య పక్షాలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి, మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.