TPCC President | ‘రాజ్యాంగ పరిరక్షణే దేశ భవిష్యత్’..
TPCC President | ‘రాజ్యాంగ పరిరక్షణే దేశ భవిష్యత్’..
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్
హైదరాబాద్లో నేషనల్ లీగల్ కాన్క్లేవ్
ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సదస్సు
రాజ్యాంగ విలువలను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడి విమర్శలు
కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శమని, రాహుల్ గాంధీ ఆలోచనలతోనే సాధ్యమైందని వ్యాఖ్యలు
TPCC President | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ లీగల్ కాన్క్లేవ్–2026’లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ లీగల్ కాన్క్లేవ్–2026’ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు, యువ నాయకులు పాల్గొన్న ఈ సదస్సును ఆయన అభినందిస్తూ, రాజ్యాంగ పరిరక్షణపై యువత మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, దేశాన్ని మనువాద సిద్ధాంతాల వైపు మళ్లించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు నిర్మించిన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటం ప్రతి భారతీయుడి బాధ్యత అని చెప్పారు. దేశ నిర్మాణంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలను విస్మరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రపంచ దృష్టిలో నెహ్రూ దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని, గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ, అభివృద్ధి పేరిట ప్రజల నుంచి ఓట్లు అడిగే ధైర్యం వారికి ఉందా అని ప్రశ్నించారు. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. “రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్న వారు, తమ పార్టీలో రాముడికి సభ్యత్వం ఉందా?” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఓటర్లను చేర్చే కార్యక్రమంగా ఉండాల్సిన ప్రక్రియ ఇప్పుడు ఓట్ల తొలగింపుగా మారుతోందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నిర్వహణపై వివాదాలు తలెత్తిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని అన్నారు.
కుల గణన అంశంపై మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించడం సామాజిక న్యాయం దిశగా కీలక అడుగుగా అభివర్ణించారు. యువత రాజ్యాంగ విలువలను కాపాడే పోరాటంలో భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలో జరిగిన పేపర్ లీక్ ఘటనల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, సామాజిక న్యాయం కోసం యువత ముందుండి పోరాడాల్సిన అవసరం ఉందని మహేష్కుమార్ గౌడ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
