రోశయ్య సేవలు ఆదర్శప్రాయం: టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్లు

హనుమకొండ, ఆంధ్రప్రభ : సాధారణ జీవనశైలి, ఉన్నత రాజకీయ విలువలు, ప్రజాసేవా దృక్పథంతో మాజీ ముఖ్యమంత్రి కోనిజేటి రోశయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్లు పేర్కొన్నారు.

శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కోనిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డైరెక్టర్లు వి. మోహన్‌రావు, వి. తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, సి. ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి రోశయ్య ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేశారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, పరిపాలనలో బాధ్యతాయుత వైఖరిని అవలంబించిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

యువత రోశయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజాసేవా భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీవీవో బోనాల కిషన్, సీఎస్‌లు రాజు చౌహన్, మాధవరావు, అన్నపూర్ణ, సీఎజీఎంలు చరణ్‌దాస్, కిషన్, వేణుబాబు, కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం, జాయింట్ సెక్రటరీలు కె. రమేష్, శ్రీకృష్ణ, జీఎంలు హేమంత్ కుమార్, కళాధర్, జయరాజ్, వెంకటకృష్ణ, వాసుదేవ్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.