జిల్లాలో సజావుగా సర్ ప్రక్రియ..
97.38 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
31.71 శాతం మేర పూర్తయిన ఫారాల డిజిటైజేషన్
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఈ కొండూరు, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాలో కచ్చితత్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని, అర్హులైన ఏ ఒక్క ఓటరూ జాబితా బయట లేకుండా.. అనర్హులెవరూ జాబితాలో లేకుండా స్వచ్ఛమైన, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలం, రామచంద్రాపురం గ్రామంలో పర్యటించారు. బీఎల్వోల ద్వారా జరుగుతున్న ఇంటింటి సందర్శన ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ దశలను పరిశీలించారు.
ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కార్యక్రమం విజయవంతానికి బీఎల్వోలు, క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16,68,565 (97.38 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 5,43,350 (31.71 శాతం) ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు.
ఈ నేపథ్యంలో మిగిలిన ఫారాల పంపిణీని పూర్తిచేయడంతో పాటు డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. తిరువూరులో 2,02,658 (97.1 శాతం), విజయవాడ పశ్చిమ 2,51,087 (97.71 శాతం), విజయవాడ సెంట్రల్ 2,70,004 (97.19 శాతం), విజయవాడ తూర్పు 2,63,563 (97.71 శాతం), మైలవరం 2,75,433 (96.59 శాతం), నందిగామ 2,00,541 (96.66 శాతం), జగ్గయ్యపేట 2,05,279 (98.9 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. బీఎల్వోలు, అధికారులు ఈసీఐ నియమనిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ప్రభావాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
