ప్రభుత్వం సూచించిన వరి రకాలను సాగు చేయాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సూచించిన వరి రకాలను సాగు చేసి ప్రయోజనం పొందాలని పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్,మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ లు తెలిపారు.డివిజన్ కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని పిఎసిఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లు ప్రారంభించారు.రైతులకు పలు రకాల విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రభుత్వం సూచించిన వరి రకాలను మాత్రమే సాగు చేయాలని, వర్షాధారిత పరిస్థితులను బట్టి స్వల్పకాలిక లేదా మధ్యకాలిక పంటలను ఎంచుకోవాలన్నారు.

ప్రభుత్వం ఎంపిక చేసిన 7 వరి రకాలను సాగు చేయాలని, వాటికే ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని తెలిపారు.నీటి ఎద్దడి ఉన్నప్పుడు పప్పుధాన్యాలు సాగు చేయాలని సూచించారు.యూరియాను సిఫార్సు చేసిన మోతాదులో పలు దఫాలుగా వాడాలని రైతులను కోరారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. రైతులు అంతర పంటలు,తక్కువ నీటితో పండే పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు.రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా, కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు, విత్తన ట్యాగ్ లను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్,ఏవో రామనరసయ్య, స్థానికులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.