క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయి..
క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయి..
- టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ 2026 బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్పోర్ట్స్ మీట్ను టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలజగ్గారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎండీ శశాంకతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం విధుల్లో తలమునకలయ్యే టీజీఐఐసీ ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని చెప్పారు. నిరంతరం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఎంతో ఉపశమనాన్ని సైతం ఇస్తాయని పేర్కొన్నారు.
క్రీడల ప్రధాన ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదని, అందరూ కలిసికట్టుగా పాల్గొనడమే అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత పెంచడానికి, స్నేహభావం చాటడానికి ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందించడానికి ఈ పోటీలు ఎంతగానో తోడ్పడతాయని వివరించారు. క్రీడాకారులందరూ జట్టు స్ఫూర్తితో ఆడాలని సూచించారు. వేడుకల్లో భాగంగా సంస్థకు చెందిన పురుష, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో స్టేడియంలో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
