ఖానాపూర్ ఎమ్మెల్యేను కలిసిన బొడ్డు గంగన్న..

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జును కడెం మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు బొడ్డు గంగన్న హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు మాట్లాడుతూ, కడెం మండలంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలని అన్నారు.
పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని, ఈ విషయంలో తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నూతన మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న మాట్లాడుతూ, తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. కడెం మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని బొడ్డు గంగన్న స్పష్టం చేశారు.
