టీమ్ ఎన్టీఆర్ కృషితో విజయవంతంగా మ్యూజియం డే

టీమ్ ఎన్టీఆర్ కృషితో విజయవంతంగా మ్యూజియం డే
అధికారులు, భాగస్వామ్య సంస్థలకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, ఆంధ్రప్రభ : గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, సాంస్కృతిక చారిత్రక సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందించారు. సోమవారం విజయవాడలోని బాపూ మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశను ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ శాఖ కమిషనర్ పి.సరేష్, డిప్యూటీ డైరెక్టర్ ఒ.రామసుబ్బారెడ్డి, ఏడీలు ఎస్.వెంకటరావు, కె.నరసింహనాయుడు, ఆర్.శివకుమార్, ఇ.భాస్కర్ నాయక్, జి.గంగాధర తదితరులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ప్రయాణంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ మ్యూజియం డే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ, ప్రతి సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు విలువైన సంపదగా అందించినప్పుడే ఏ ప్రగతి అయినా సుస్థిరమవుతుందని పేర్కొన్నారు.
“టీమ్ ఎన్టీఆర్” సమిష్టి కృషి, గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు ఘనవిజయం సాధించాయని తెలిపారు. శాఖల మధ్య సమన్వయం, సృజనాత్మక ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యంతో మ్యూజియం డే వేడుకలు ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
