అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఇద్దరిపై కేసు నమోదు – ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పౌర సరఫరాల ( పిడిఎస్ ) బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు ప్రాంతానికి తరలిస్తున్న ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా 16 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ సి. ఆంజనేయులు ఆదివారం మీడియాకు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలు, డీఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
మే 17 ఉదయం సుమారు 10 గంటల సమయంలో హిందూపురం మండలం మనేసముద్రం గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎపి-39-టీ ఎన్-3414 నంబర్ గల ఐచర్ వాహనంలో భారీ మొత్తంలో పిడిఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హారతి, వీఆర్వో ల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం వివరాలు:
50 కేజీల బియ్యం సంచులు – 294
25 కేజీల బియ్యం సంచులు – 52
మొత్తం బియ్యం – 16,000 కేజీలు (16 టన్నులు)
ఈ కేసులో సోమందేపల్లి గ్రామానికి చెందిన మహేష్ (26), కురుబ రామకృష్ణప్పపై కేసు నమోదు చేశారు. వాహనం డ్రైవర్ మహేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు రామకృష్ణప్ప పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడిని త్వరలో అదుపులోకి తీసుకుని, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకొని భారీ మొత్తంలో పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సీ. ఆంజనేయులు, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు ప్రకటించారు. దాడిలో సీ. ఆంజనేయులు – ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎ. లక్ష్మీనారాయణ – సబ్ ఇన్స్పెక్టర్, ఈ. శ్రీనివాసులు, బీ. రవి, గిరి ప్రసాద్ – కానిస్టేబుల్, భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.
