chandrababu | ఏపీ నలువైపులా కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తాం

chandrababu | ఏపీ నలువైపులా కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తాం
chandrababu | సంపద సృష్టించి ప్రజలకు మేలు చేస్తాం
కిమ్స్ శంకుస్టాపనలో చంద్రబాబు
chandrababu | విజయవాడ, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతినే కాకుండా వాణిజ్య రాజధాని విశాఖను సైతం విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని, ఏపీ నలువైపులా కొత్త సంస్థలు ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తామన్నారు. మంగళగిరి మండలం నిడమర్రులో నిర్మించనున్న కిమ్స్ ఆస్పత్రికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంపద సృష్టించడం చాలా సులభమన్నారు. దేశానికే మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందని తెలిపారు. లక్ష మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని.. వైద్యులు కూడా ఏఐని నేర్చుకుంటున్నారని తెలిపారు.
లక్షల మందికి ఉద్యోగాలు..
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎం విమర్శించారు. లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. 2027 మే 13న కిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని అన్నారు. 2028 ఆగస్టు 15 కంటే ముందే విశాఖలో గూగుల్ ఆపరేషన్లు మొదలవుతాయని తెలిపారు. డిసెంబర్ నాటికి దేశానికి క్వాంటం కంప్యూటింగ్కు చిరునామాగా అమరావతి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో అమరావతి నుంచి ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రెండో సారి కూడా పూలింగ్ తో భూముల సేకరణ
రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ఫేజ్-2కు పిలుపునిస్తే రైతులు ముందుకొచ్చారన్నారు. బంగారం కొనడంపై అందరూ ఆలోచించాలని సూచించారు. కర్నూలులో బంగారం ఉత్పత్తి మొదలు కాబోతోందని వెల్లడించారు. దేశంలో ఉత్పత్తయ్యే బంగారంలో 50శాతం ఇక్కడే అవ్వబోతోందని చెప్పారు. దీంతో దిగుమతి ద్వారా ఎదురవుతున్న సమస్యలను అధిగమించొచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ హరీశ్, మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిడమర్రులో కిమ్స్ ఆస్పత్రి, స్కిల్ వర్సిటీకి సీఆర్డీఏ 23 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. రెండేళ్లలో ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తామని కిమ్స్ అధికారులు తెలిపారు.
