29thaprileditorial | గూగుల్ ఏఐ హబ్తో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
29thaprileditorial | గూగుల్ ఏఐ హబ్తో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
29thaprileditorial | విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ ప్రారంభం
ఏఐ హబ్తో పెరుగుతున్న ఐటి అవకాశాలు
యువతకు కొత్త అవకాశాల ద్వారం
గ్రీన్ ఎనర్జీతో ఆధునిక డేటా సెంటర్
విశాఖ గ్లోబల్ టెక్ హబ్గా ఎదుగుదల
29thaprileditorial | గూగుల్ ఏఐ హబ్కు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భూమిపూజ చేసి శంకుస్థాపన చేసిన సందర్భం తెలుగు వారందరికీ మరిచిపోలేని రోజు. వన్ గిగావాట్ సామర్థ్యంతో, రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెగా డేటా సెంటర్ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. హరిత విద్యుత్తుతో నడిచే మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ కనెక్టివిటీకి ఇది ఎంతో దోహదం చేస్తుంది.
ఇలాంటి ప్రాజెక్ట్ మన ప్రాంతానికి దక్కడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదల, కార్యదీక్ష కారణంగానే ఈ సంస్థ విశాఖకు వచ్చింది. ఈ సంస్థకు విశాఖలోని ఆనందపురం సమీపంలోని తర్లుపాడు వద్ద 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కంప్యూటర్ క్లౌడింగ్, ఏఐ డేటా సెంటర్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ ప్రస్తావిస్తున్న వికసిత భారతానికి పునాది. ప్రపంచంలో భారతాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు జరుగుతున్న కృషికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది.
సబ్సీ కేబుల్ గేట్వే కలిగిన ముంబై, చెన్నైలతో సమానంగా విశాఖ నిలుస్తుంది. ఆసియాలోనే ఇలాంటి కేంద్రం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. ఈ కేంద్రం ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అలాగే పదివేల మంది మహిళలు మైక్రో ఎంటర్ప్రైజ్లుగా ఎదగడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)దే. కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తూ, శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో మన యువత ఎదగడానికి ఇది దోహదం చేస్తుంది. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో బెంగళూరుతో పోటీ పడి మన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఈ రంగంలో తమ ప్రతిభను కనబర్చారు. అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో మనవారు తమ ప్రతిభను చాటుతున్నారు.

ట్రాన్స్మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లతో ఈ ప్రాంతానికి ఇంధన భద్రత కల్పించబడుతుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. నేరుగా విదేశీ డేటా సెంటర్లతో అనుసంధానమై, దేశంలోని ఇతర డేటా సెంటర్లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏఐ హబ్గా విశాఖ ప్రపంచ వేదికపైకి అడుగు పెట్టనుంది. ఈ కేంద్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభింపజేస్తామని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఏఐ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి.
ఈ కేంద్రం వల్ల విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం బెంగళూరు సిలికాన్ వ్యాలీగా ముందంజలో ఉండగా, దానిని అధిగమించేందుకు హైదరాబాద్, విశాఖలు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి ఐటి కేంద్రాలు అభివృద్ధి చెందాయి. ఐటి రంగంలో తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పేర్కొన్నారు.
