అక్రిడేషన్ కమిటీ నియామకాలపై కలెక్టర్కు ఫిర్యాదు

అక్రిడేషన్ కమిటీ నియామకాలపై కలెక్టర్కు ఫిర్యాదు
- పారదర్శకంగా విచారణ జరిపించాలని వినతి
- అర్హులకు అవకాశం కల్పించాలని డిమాండ్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అక్రిడేషన్ కమిటీ నియామకాల్లో పారదర్శకత పాటించలేదని ఆరోపిస్తూ సీనియర్ జర్నలిస్టు డాక్టర్.తాళ్లపల్లి వెంకట సమ్మయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆదివారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఆయన, కమిటీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. జిల్లాలో 40 సంవత్సరాలుగా పత్రికా రంగంలో సేవలందిస్తున్న తనకు అక్రిడేషన్ కమిటీలో సభ్యునిగా అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయుడిగా, విశేష అనుభవం కలిగిన తనను పరిగణలోకి తీసుకోకుండా నియామకాలు చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. కమిటీలో కొందరు అనర్హులను సభ్యులుగా నియమించారని, వార్తలు రాయలేని వారికీ అవకాశం కల్పించారని ఆరోపించారు. కొందరు పత్రికలు పీడీఎఫ్ రూపంలో కూడా లేవని, అలాంటి వారిని సభ్యులుగా ఎంపిక చేయడం ప్రశ్నార్థకమని అన్నారు.
అందువల్ల ప్రస్తుతం నియమించిన కమిటీని రద్దు చేసి, పారదర్శకంగా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విధాల అర్హత కలిగిన తనకు సభ్యునిగా అవకాశం కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఈ వినతిపత్రం ప్రతులను సంబంధిత అధికారులకు కూడా పంపించినట్లు సమ్మయ్య తెలిపారు.
