Restoration | మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్కి పునరుజ్జీవనం

Restoration | మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్కి పునరుజ్జీవనం
Restoration | లక్ష కోట్ల నిధులతో ప్రారంభమైన మూసీ సుందరీకరణ కార్యక్రమం
ఆక్రమణలు, మురుగునీటి సమస్యలు ఇంకా సవాలు
నాగరాభివృద్ధిలో మూసీ తీరాల ప్రాధాన్యం
భవిష్యత్తులో నది పునరుజ్జీవనానికి అవకాశాలు
Restoration | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. లక్ష కోట్ల నిధులతో మూసీ సుందరీకరణ కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ తీర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, నది తీరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడం వంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా మూసీ తీరాలను ప్రజలకు వినోదం, విశ్రాంతి ప్రదేశాలుగా మార్చే ఆలోచన కూడా ఉంది. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే, మూసీ మళ్లీ హైదరాబాద్కు పర్యావరణ ఊపిరిలా మారవచ్చని కొందరు భావిస్తున్నారు.

అయితే, మూసీ నది పునరుద్ధరణ సులభమైన పని కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూసీ చుట్టూ ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి ప్రధాన సవాల్. ఒక వైపు ప్రతిపక్షాలు పేదల ఇళ్లను కూల్చి మూసీ పునరుద్ధరణ చేయడం సరియాదని నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. మరో వైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగర చరిత్రలో మూసీ నది ఒక కీలక పాత్ర పోషించింది. శతాబ్దాల పాటు భాగ్యనగరానికి జీవనాధారంగా నిలిచిన నది, నగరం ఏర్పడినప్పటి నుంచి Hyderabad ప్రాంతాలు వ్యవసాయం, తాగునీటి అవసరాలకు ఆధారపడేవి. 1908లో మూసీ నది ఉగ్రరూపం దాల్చి వరదతో నగరాన్ని ముంచెత్తింది. నది ప్రవాహంలో దాదాపు 15,000 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి.

ఆ ఘటన తర్వాత నిజాం మరి మహబూబ్ అలీ ఖాన్ చలించిపోయారు. మూసీ నది నుంచి ప్రజలను కాపాడేందుకు నిజాం ప్రభుత్వం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించింది. ఆయన సూచనల మేరకు 1920–1927 మధ్య ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించి వరదలను అరికట్టడమే కాకుండా, తాగునీటి సమస్యను పరిష్కరించారు.

మూసీ నది తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తుంది. అక్కడి చిన్న కొండలు, అటవీ ప్రాంతాలు, వర్షపు నీరు కలసి చిన్న ప్రవాహాలుగా మారి తర్వాత మూసీ నదిగా రూపుదిద్దుకుంటాయి. నది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించే ముందు అనేక చిన్న వాగులు, వర్షపు నీటి ప్రవాహాలు దానిలో కలుస్తాయి. నగరంలోకి వచ్చిన తర్వాత మూసీ పాత నగరాన్ని దాటి తూర్పు వైపు ప్రయాణించి చివరికి కృష్ణా నదిలో కలుస్తుంది.

కాకపోతే, కాలక్రమేణా హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నగరం వేగంగా విస్తరించడంతో మూసీ నది పరివాహక ప్రాంతాలు నిర్మాణాలతో నిండిపోయాయి. ఒకప్పుడు నది విస్తరించి ప్రవహించే ప్రాంతాల్లో ఇప్పుడు ఇళ్లు, కాలనీలు, గోదాములు కనిపిస్తున్నాయి. అంతేకాదు, నగరంలోని అనేక మురుగునీటి కాలువలు నేరుగా మూసీలో కలుస్తున్నాయి. రోజుకు లక్షల లీటర్ల మురుగునీరు ఈ నదిలోకి చేరుతూ, మూసీ నది సహజ ప్రవాహం తగ్గిపోవడమే కాకుండా, తీవ్ర కాలుష్యానికి గురై ఉమ్మడి నల్గొండ జిల్లాకు శాపంగా మారింది.

ఇటువంటి పరిస్థితుల్లో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మూసీ సుందరీకరణ కార్యక్రమం ప్రారంభించారు. మూసీ నీటిని శుద్ధి చేసేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో దుర్వాసన సమస్య తగ్గింది.

అయినా, ప్రపంచంలో ఒకప్పుడు కాలుష్యంతో నిండిపోయిన నదులను తిరిగి పునరుద్ధరించిన నగరాలు ఉన్నాయి. సరైన ప్రణాళిక, దీర్ఘకాలిక దృష్టి, ప్రజల సహకారం ఉంటే మూసీ కూడా మళ్లీ జీవం పొందే అవకాశం ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ చరిత్రలో మూసీ నది ముఖ్యమైన వనరు. ఆ నది మళ్లీ సజీవంగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ప్రశ్న.

