25th Division | సెంట్రల్లో అభివృద్ధి జోరు…

25th Division | సెంట్రల్లో అభివృద్ధి జోరు…
అయ్యన్న నాయుడు వీధిలో డ్రైనేజీ పనులు ప్రారంభం
పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా.
రూ.40 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.20 లక్షలతో తాగునీటి పైప్లైన్ పనులు…
సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఎమ్మెల్యే బొండా ఉమ
25th Division | పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తెలిపారు. నగరంలోని 25వ డివిజన్ దుర్గ అగ్రహారం ప్రాంతంలోని అంకమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న అయ్యన్న నాయుడు వీధిలో నూతన అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల పనులను గుర్తించి వాటిని దశలవారీగా పూర్తి చేసే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గత 20 నెలల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.300 కోట్లకు పైగా నిధులు కేటాయించి పలు పనులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అధికారులతో చర్చించి వెంటనే నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిపించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అయ్యన్న నాయుడు వీధిలో గత కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, గతంలో నాసిరకం పనుల వల్ల డ్రైనేజీ తరచూ బ్లాక్ అవుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై వెంటనే స్పందించి రూ.40 లక్షల వ్యయంతో నూతన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి, అదనంగా రూ.20 లక్షలతో తాగునీటి పైప్లైన్ పంపుల ఏర్పాటు పనులకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని కోరారు. ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీపై ఎమ్మెల్యే కార్యాలయం బాధ్యతగా స్పందించి అధికారులతో కలిసి పరిష్కార చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మహిళా నాయకులు మాచర్ల పావని, సామ్రాజ్యం, డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపినాథ్, ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు, సుబ్బారావు, దొంగర ఆంజనేయులు, దుర్గారావు, బాడీత సురేష్, సిరిదీప్, కళ్యాణ్, కృష్ణ, గిరి, విజయ్, శాంసన్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
CLICK HERE TO READ MORE : Ration rice | దోపిడీ వెనుక ఉన్నది అవినాష్ అనుచరులే
