స్పోర్ట్స్ సిటీగా విజయవాడ..
స్పోర్ట్స్ సిటీగా విజయవాడ..
తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం
క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం
ఆధునికరణతో ఇండోర్ స్టేడియంను రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తాం
విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)
విజయవాడ, ఆంధ్రప్రభ : భవిష్యత్తులో విజయవాడను రాష్ట్రంలోనే ప్రముఖ స్పోర్ట్స్ సిటీ గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదనీ క్రీడల్లోనూ విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అనీ యువత కలలను సాకారం చేసే స్పోర్ట్స్ హబ్గా విజయవాడను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) స్పష్టం చేశారు.

శనివారం విజయవాడ లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ, క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత వ్యక్తిత్వ వికాసంలో క్రీడల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విజయవాడలోని యువ క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించేందుకు అత్యుత్తమ క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించినట్లు తెలిపారు. పీవీ సింధు స్థాయి క్రీడాకారులు మాత్రమే కాదనీ ఆమె స్పూర్తితో మన గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించే ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు.
వారికి కావాల్సిన వేదికలు, శిక్షణా సదుపాయాలు, ప్రోత్సాహం అందించడం మన బాధ్యత అని ఎంపీ పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ రంగంలో చేతన్ ఆనంద్, పీ.వి.వి. లక్ష్మి, రుత్వికా శివాని, మేఘనా జక్కంపూడి, సూర్య చరిష్మ వంటి ప్రతిభావంతులను అందించిన విజయవాడ, రాబోయే రోజుల్లో మరింత మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను దేశానికి అందించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇండోర్ స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, క్రీడాకారులు అత్యుత్తమ వాతావరణంలో సాధన చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
క్రీడలకు సంబంధించిన మౌలిక వసతుల విస్తరణ, శిక్షణా సదుపాయాల మెరుగుదల, యువ ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఎంపీ స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి వారిని అభినందించారు. పోటీల నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.
