వైఎన్ కళాశాల విద్యార్థికి అగ్నివీర్‌లో ఉద్యోగం

ట్యాంక్ గన్నర్‌గా ఎంపికైన భానుకు ఘన సన్మానం

నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాలలో చదువుతున్న జి. భాను అగ్నివీర్–2025 నియామకాల్లో 7 ఆంధ్ర నేవల్ యూనిట్ తరఫున ట్యాంక్ గన్నర్‌గా ఎంపికై ఉద్యోగం సాధించాడు.

ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో యాజమాన్యం, అధ్యాపకులు భానును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

కళాశాల వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్రీ రఘురామారావు మాట్లాడుతూ కృషి, పట్టుదలతో చేసిన ప్రతి ప్రయత్నం విజయాన్ని అందిస్తుందని, అందుకు భాను నిదర్శనమని అన్నారు. చదువుతో పాటు ఎన్‌సీసీలో శిక్షణ పొందడం వల్ల క్రమశిక్షణ అలవడి చిన్న వయసులోనే ట్యాంక్ గన్నర్‌గా ఉద్యోగం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.

భానును ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా తమ లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల విద్యార్థి ఈ ఘనత సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. భానుకు శిక్షణ అందించిన ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ జి. సునీతను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనకారావు, వైస్ ప్రిన్సిపల్ బెజవాడ వెంకటరత్నం, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ జి. సునీత, పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు పి. మారుతీరావు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.