రైలు ఎక్కబోతూ జారిపడి యువతి దుర్మరణం
రైలు ఎక్కబోతూ జారిపడి యువతి దుర్మరణం
కరీమాబాద్, (ఆంధ్రప్రభ), వరంగల్ ఈస్ట్: వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్పై నుంచి జారిపడి ఓ యువతి మృతి చెందిన ఘటన వరంగల్ జీఆర్పీ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జీఆర్పీ సీఐ సురేందర్ కథనం ప్రకారం, సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన పుప్పాల ధరణి వరంగల్లోని తన తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. ఈ నెల 10న మధ్యాహ్నం తల్లి భాగ్యలక్ష్మితో కలిసి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది.
వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 వద్ద షిర్డీ–సాయినగర్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం.17206) ఎక్కే ప్రయత్నంలో ఉండగా, ప్రమాదవశాత్తు ట్రైన్కు ప్లాట్ఫామ్కు మధ్యలో జారిపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఆన్డ్యూటీ వైద్యులు ధ్రువీకరించినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై జీఆర్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
