Union Minister | అచ్చతెలుగు ఆహార్యంతో రామ్మోహనం..

Union Minister | అచ్చతెలుగు ఆహార్యంతో రామ్మోహనం..
Union Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో వచ్చిన రామ్మోహన్ నాయుడును చూసి ప్రధాని మోదీతో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా డిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో ఇవాళ పండుగ వేడుకలు జరిగాయి. తెలుగు, తమిళ సంప్రదాయాలను మిళితం చేస్తూ.. ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరవ్వగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తన సహచర మంత్రులు, ఎంపీలతో కలసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ప్రధాని మోదీని రామ్మోహన్ నాయుడు సత్కరించారు. అయితే ఎప్పుడూ కోట్, జాకెట్, డ్రెస్సింగ్ విధానాన్ని అవలంభించే రామ్మోహన్ నాయుడు.. అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ధోవతి వేసుకుని ఈ యువ కేంద్ర మంత్రి అందరినీ ఆకట్టుకున్నారు.
