హైదరాబాద్ : ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగాయాత్ర నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి సైనిక్ ట్యాంక్ వరకు ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 5.30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలవనున్న యాత్ర.. సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక్ ట్యాంక్ చేరుకోనుంది.
ట్రాఫిక్ ఆంక్షలు..
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. దీంతో సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎలాంటి వాహనాలను అనుమతించరు. యాత్ర సాగుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
