శ్రావణ మాసం…అమ్మవారి ఆరాధనకు మహిమాన్విత మాసం..

గంపలగూడెం (ఆంధ్రప్రభ): శ్రావణమాసం పూజల మాసం.. శుభప్రదమైన మాసం..లక్ష్మీప్రదమైన మాసం..పండుగల మాసం..మహిళలకు ప్రీతిపాత్రమైన మాసం..వర్ష రుతువుతో పరిసరాలు కళకళలాడే మాసం..ఈ సకల శుభాల శ్రావణమాసం ఈ నెల 13 నుండి సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది.తెలుగు సంవత్సరాల్లో ఐదవ మాసంగా ఉన్న ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణమాసం. శ్రీమన్నారాయణ జన్మనక్షత్రం శ్రవణం ఆ పేరు మీద వచ్చిన నక్షత్రం కావడంతో లక్ష్మీదేవికి ఈ నెల అత్యంత ప్రీతికరం.ఇళ్లన్నీ పూజాధికాలతో శోభిల్లే కాలం ఇది. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలోనే అలానే శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే..శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే కావున మహిళలు భక్తిశ్రద్ధలతో నోములు,వ్రతాలు ఆచరించి విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటారు.ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం,వరలక్ష్మీ వ్రతం,నాగపంచమి,పుత్రదా ఏకాదశి,రాఖీ పూర్ణిమ,హయగ్రీవ జయంతి,రాఘవేంద్ర జయంతి,శ్రీ కృష్ణాష్టమి,కామిక ఏకాదశి,పోలాల అమావాస్య చాలా ముఖ్యమైన పర్వదినాలు. ఈ మాసంలో మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.ముత్తైదువులతోపాటు,పెండ్లికాని యువతులు ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు.పసుపు,బంగారం,వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.శ్రావణ శుద్ద చవితి,పంచమి రోజున నాగుల చవితి,నాగపంచమిని జరపుతారు.ఆ రోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలిగిపోతాయని భావిస్తారు.శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని మహిళలు భక్తితో కొలుస్తారు.అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు.

నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టఐశ్వర్యాలు,సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్ధిస్తారు.అదే విధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా జరుపుతారు. అదే రోజున అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కడతారు.శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆరోజున శ్రీ కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిస్తారు.ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది.చిన్నారులతో కృష్ణుడి వేషాలు,ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.శ్రావణ మాసం కృష్ణ పక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు .సంతానాన్ని కోరుకునే వారు,పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు.అదేవిధంగా శ్రావణమాసంలో సోమవారం రోజున శివునికి ఆవుపాలు, పెరుగు,చక్కెర,నెయ్యి,తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కావున ఈ ప్రీతికరమైన మాసం మొత్తం మహిళలు భక్తితో నిష్ఠగా ఉండి అమ్మవారికి విశేష పూజలు చేసుకుంటారు.కావున ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది.