summer heat relief | దాహంతో అలమటిస్తున్న జీవాలకు జిల్లా యంత్రాంగం అండ

summer heat relief | దాహంతో అలమటిస్తున్న జీవాలకు జిల్లా యంత్రాంగం అండ
summer heat relief | ఎక్కడికక్కడ చలివేంద్రాలు.. నీటి తొట్టెలతో మానవత్వం
పక్షులు, పశువుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి ప్రత్యేక ఏర్పాట్లు
ఓ చిన్న నీటి పాత్ర.. ఎన్నో ప్రాణాలకు జీవాధారం
“దయను సామాజిక ఉద్యమంగా మార్చుకుందాం” : కలెక్టర్ లక్ష్మీశ
మండే వేసవిలో హృదయాలను హత్తుకుంటున్న సేవా కార్యక్రమాలు
మానవత్వం, పర్యావరణ పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కృషి

summer heat relief | విజయవాడ, ఆంధ్రప్రభ ; ఎండలు మండిపోతున్నాయి… ఉదయం నుంచే రోడ్లు నిప్పుల కుండల్లా మారుతున్నాయి. చెట్టు నీడ కోసం మనుషులు ఆగిపోతుంటే… మాటలు చెప్పలేని మూగజీవాల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించడమే కష్టం. దాహంతో అలమటించే పక్షులు… నాలుక బయటపెట్టి తిరిగే పశువులు… ఎండ తాకిడితో వణుకుతున్న జీవరాశులు… ఇలాంటి హృదయ విదారక దృశ్యాల మధ్య జిల్లా యంత్రాంగం చూపిస్తున్న మానవత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు అధికారులు “సేవే లక్ష్యం” అన్న భావనతో ముందుకు వచ్చారు. ప్రజలకే కాదు… పక్షులు, పశువులు, మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో పశువుల కోసం పెద్ద పెద్ద నీటి తొట్టెలను ఏర్పాటు చేయగా… ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలనీలు, రహదారుల వద్ద చిన్న చిన్న నీటి పాత్రలను ఉంచుతున్నారు.

ఆ నీటి పాత్రల దగ్గరికి ఎగిరొచ్చి నీళ్లు తాగుతున్న చిలుకలు, కాకులు, పిచ్చుకలు… దాహం తీర్చుకుని మళ్లీ ఎగిరిపోతున్న దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోతోంది. మండే ఎండల్లో ఒక చుక్క నీరు కూడా ఎంతటి ప్రాణాధారమో ఈ దృశ్యాలు చెబుతున్నాయి. మాటలేని జీవాలకు మనుషులు అండగా నిలబడితే… ప్రకృతే మనపై కరుణ చూపుతుందనే భావన ప్రజల్లో కలుగుతోంది.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల కోసం కూడా ప్రత్యేకంగా చల్లని తాగునీటి ఏర్పాట్లు చేశారు. అధికారులు కేవలం ఆదేశాలు ఇచ్చి పక్కన నిలబడకుండా… స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పేలా ఈ చర్యలు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ భావోద్వేగంగా స్పందించారు. “ఒక చిన్న నీటి పాత్ర ఎన్నో ప్రాణాలను కాపాడగలదు. ఇది కేవలం నీళ్లు పెట్టడం కాదు… జీవాలపై మన దయను చూపించడం” అని పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి విద్యాసంస్థ, ప్రతి కాలనీలో పశుపక్ష్యాదుల కోసం నీటి పాత్రలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
“దయను ఒక సామాజిక ఉద్యమంగా మార్చుకుందాం… మానవత్వపు దారిలో సుస్థిర అభివృద్ధి వైపు కలిసి నడుద్దాం” అంటూ కలెక్టర్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు జిల్లాలో ఒక మంచి మార్పుకు నాంది పలుకుతోంది.
ఈ మండే వేసవిలో… చల్లని నీళ్లు మాత్రమే కాదు… చల్లని మనసులూ అవసరం అని జిల్లా యంత్రాంగం చేతల్లో చూపిస్తోంది..

click here to read దేశవ్యాప్తంగా మెరిసిన ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ..
