ముంబై : దేశీయ మార్కెట్లు గురువారం కూడా ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయి. భారత్-పాక్ మధ్య భగ్గుమంటోన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల నడుమ.. తొలుత స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 30పాయింట్ల నష్టంతో 80,730 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 24,393 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 16పైసలు పెరిగి, 84.61 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డా.రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, సిప్లా, మారుతీ సుజుకీ, అపోలో హాస్పిటల్స్ స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు ప్రారంభంలో ఊగిసలాడుతున్నాయి. స్వల్పకాలంలో సవాళ్లు ఉండొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. అంచనాలకు తగినట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించారు. ఈ పరిణామాల వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.