టోక్యో – జపాన్ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. గత రెండు రోజులుగా వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి తెలంగాణ లో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరారు. ఇక పర్యటన లో మూడో రోజైన నేడు సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించనున్నారు.
అనంతరం టోక్యో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంలో కీలకంగా మారనుంది.తర్వాత, భారత ఎంబసీ ఆధ్వర్యంలో జరగనున్న పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇందులో టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అవుతారు.
ఈ సమావేశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చించనున్నారు. ఆ తర్వాత, జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (JOIN) ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో నగరాభివృద్ధి, రవాణా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గాలు చర్చించనున్నారు.
అంతేకాకుండా, టోక్యోలోని ప్రసిద్ధ సుమిదా నది తీర ప్రాంతం ను సీఎం సందర్శించనున్నారు. ఈ సందర్శన ద్వారా నగర ప్రణాళికల్లో కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించే అవకాశం ఉంది. ఈ పర్యటన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల రాకకు దారితీసేలా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారేలా ఉండబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.